

భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో, పూజారులు మరియు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణ ఆధారంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు.
ఆలయ సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా, పూర్తిగా ఆగమశాస్త్రానికి అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, సమగ్ర ప్రణాళికతో మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే వచ్చే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా చేయగలిగిన పనులను గుర్తించి, అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలిపారు.
గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం మరియు అభివృద్ధి పనులను చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. 2027 మార్చి 31 నాటికి తొలి దశ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు ముందుగానే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!