

ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నెల 14 న ఖమ్మం జిల్లా పరిధిలోని కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్లో ఆయన ప్రయాణిస్తున్న కారు మునిగిపోగా మృతదేహాన్ని గుర్తించారు. ఘటన అనంతరం కారు నడిపిన వ్యక్తి ఒడ్డుకు చేరి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. సదరు వ్యక్తి హైదరాబాద్లో లొంగిపోయే అవకాశముందని సమాచారం. కారు యజమానిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
నేలకొండపల్లి ఆస్పత్రిలో నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో శ్రీనివాస్ నీట మునగడం వల్ల కాకుండా, శరీరంపై గాయాల కారణంగా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిసింది. మిస్టరీగా మారిన ఈ కేసు మరో రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శ్రీనివాస్ సెల్ టవర్ వ్యాపారంలో ఉండటంతో ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కూసుమంచి ఎస్సై నాగరాజు మాట్లాడుతూ దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!