

అయోధ్యలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్మార్క్ అని వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తమ పాలనను ఎప్పుడూ రామరాజ్యంతోనే పోల్చుకుంటామని అన్నారు. అయోధ్యలో నిర్మితమైన రామమందిరం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఎన్నో వివాదాల అనంతరం ఆలయం నిర్మితమై దేశ ప్రజల కల సాకారమైందని, అయోధ్య రామాలయం ఇప్పుడు దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని చెప్పారు. ఆలయ నిర్మాణంతో పాటు ఉత్తరప్రదేశ్లో సుపరిపాలన అందిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో యూపీ, బీహార్ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. శ్రీరామ దర్శనం అనంతరం ఎక్స్లో స్పందించిన చంద్రబాబు, రాముడు పాటించిన విలువలు కాలాతీతమని, సుపరిపాలనకు అవి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అయోధ్యలో శ్రీరామ దర్శనం తనకు నూతన శక్తిని ఇచ్చిందని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామజన్మభూమి ఆలయంలో బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగి ఈ నెల 31 వ తేదీతో రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 31 న జరగనున్న రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రామజన్మభూమి ఆలయ ఆవరణలోని అన్నపూర్ణాదేవి ఆలయంలో రాజ్నాథ్ సింగ్ ధ్వజావిష్కరణ చేయనున్నారు. భక్తులు, ప్రముఖుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుకలు జరగనున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!