

ఢిల్లీ నుంచి ముంబయికి బయలు దేరిన Air India విమానంలో సోమవారం తెల్లవారుజామున ఊహించని సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానంలోని కుడివైపు ఇంజిన్కు సంబంధించిన ఆయిల్ ప్రెజర్ ప్రమాదకరంగా తగ్గిపోవడాన్ని పైలట్లు గుర్తించారు. కొద్దిసేపటికి ఆ ఆయిల్ ప్రెజర్ పూర్తిగా జీరోకి పడిపోయింది.
ఈ పరిస్థితిని గమనించిన పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ విమానాన్ని తిరిగి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికే మళ్లించారు. టేకాఫ్ అయిన అదే ఎయిర్పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉదయం 3.20 గంటల సమయంలో Air India కి చెందిన Boeing aircraft (ఫ్లైట్ నంబర్ AI887) ఢిల్లీ నుంచి ముంబయికి బయల్దేరింది. ఇంజిన్ నంబర్–2 లో ఆయిల్ ప్రెజర్ అసాధారణంగా తగ్గడం వల్లే ఈ అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన పై Air India అధికారికంగా స్పందించింది. భద్రతా నిబంధనల ప్రకారమే విమాన సిబ్బంది నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఆ విమానానికి సంబంధించిన సాంకేతిక తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. అనుకోని పరిస్థితి వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ముంబయికి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ పేర్కొంది.
ఇటీవల కాలంలో కూడా Air India విమానాల్లో ఇలాంటి సాంకేతిక లోపాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నుంచి విశాఖపట్నానికి బయల్దేరిన Air India ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ సమయంలో అకస్మాత్తుగా ఆగిపోయిన ఘటన గుర్తుండే విషయమే. ఆ సమయంలో విమానంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సహా 163 మంది ప్రయాణికులు ఉన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!