

పద్మశ్రీ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన, “కోటి మొక్కల రామయ్య” గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఇప్పుడు సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన కథ ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగానికి ఎంపికైంది. నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, బుసం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని అందించారు.
తాజాగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్, తన్నేరు బాబు రావు, నాగ మహేష్, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. చిత్రాన్ని త్వరలోనే భారతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆయన ఊరూరూ తిరిగేవారు. శుభకార్యాల్లో మొక్కలను బహుమతిగా ఇవ్వడం, చెట్ల గింజలను సేకరించి అడవుల్లో చల్లడం వంటి కార్యక్రమాలతో ప్రకృతిని కాపాడేందుకు కృషి చేశారు. గత ఏడాది ఏప్రిల్లో ఆయన మరణించినప్పటికీ, ఆయన చూపించిన మార్గం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ బయోపిక్ ద్వారా ఆయన సేవలు మరింత మంది ప్రజలకు చేరనున్నాయి.
.jpeg)






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!