

నేటి తరానికి దేశం, ధర్మం, దైవ భావనలను తెలియజెప్పే చిత్రంగా రూపొందిన ‘అఖండ 2’ అఖండ విజయాన్ని సాధించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆశీర్వదించారు. ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దేశం, ధర్మం, దైవం వంటి భారతీయ శాశ్వత విలువలను నేటి తరానికి అర్థవంతంగా, ప్రభావవంతంగా చేరవేసే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘అఖండ 2’ చిత్రాన్ని ప్రశంసిస్తూ, సినిమా అఖండ విజయాన్ని సాధించాలని దర్శకుడు బోయపాటి శ్రీనును ఆశీర్వదించారు. సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన చిత్రాలు మరింతగా రావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, దేశం, ధర్మం, దైవం వంటి మూల విలువలను నేటి తరానికి గుర్తు చేయాలనే సంకల్పంతో ‘అఖండ 2’ను రూపొందించామని తెలిపారు. ఈ ప్రయత్నానికి మోహన్ భగవత్ ఆశీర్వాదం లభించడం తమ టీమ్కు గొప్ప గౌరవంతో పాటు మరింత బాధ్యతను, స్ఫూర్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.
భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావనలు, దేశభక్తి వంటి అంశాలను సమకాలీన కథన శైలితో మేళవిస్తూ రూపొందిన ‘అఖండ 2’ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేయడమే కాకుండా భావోద్వేగంగా కూడా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యువతలో ధర్మబోధ, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతను నాటే ప్రయత్నం ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్ఫుల్ ప్రదర్శనలతో దూసుకుపోతున్న ‘అఖండ 2’, ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటూ విజయపథంలో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా విడుదలైన ఫోటోలో దర్శకుడు బోయపాటి శ్రీను, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసి కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!