

గత సంవత్సరం తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కెటిఆర్ పై విమర్శలు చేస్తూ, ఆ సందర్భంలో అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ముఖ్యంగా నాగచైతన్య మాజీ భార్య సమంత పేరును ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో ఆమె వ్యాఖ్యలు తీవ్రంగా విమర్శించబడ్డాయి.
మంత్రిగా ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఆ సమయంలో సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పకుండా, తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై అక్కినేని కుటుంబం తీవ్రంగా స్పందించింది. నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేసి, కోర్టును ఆశ్రయించారు.
దాదాపు 13 నెలల తర్వాత, ఇప్పుడు కొండా సురేఖ తన వ్యాఖ్యలపై స్పందించారు. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఆమె అన్నారు:
“నాగార్జున గారికి సంబంధించిన నా వ్యాఖ్యలతో ఆయన కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే, దానికి నేను చింతిస్తున్నాను. వారిని బాధించే లేదా పరువుకు నష్టం చేకూర్చే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను.”
అయితే, సురేఖ క్షమాపణ చెప్పకపోవడం, కేవలం వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే పరిమితమవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు నెటిజన్లు ఆమె నాగార్జున, నాగచైతన్య, అలాగే సమంతకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!