

చాయ్ షాట్స్లో విడుదలైన ‘దందా’ వర్టికల్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తన సినీ ప్రయాణం, ‘దందా’ విజయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఉన్న మక్కువతో ఇంజనీరింగ్ను మధ్యలోనే వదిలి, ఎలాంటి గాడ్ఫాదర్ లేకుండానే ఫోటోగ్రఫీ, మాస్ కమ్యూనికేషన్ నేర్చుకుని సినీ రంగంలోకి వచ్చానని చెప్పారు. 28 ఏళ్లలోపు దర్శకుడు కావాలన్న తన కలను నిజం చేసుకున్నానని తెలిపారు.
‘దందా’ కథను విజయ్ కుమార్ రాసినా, దాదాపు 40 శాతం స్క్రిప్ట్ను తాను తిరిగి రాసి పాత్రలకు మరింత బలం చేకూర్చానని ఆదిత్య వెల్లడించారు. వర్టికల్ స్టోరీటెల్లింగ్లో కొత్త ట్రెండ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ను రూపొందించామని చెప్పారు. ఇప్పటివరకు ఈ సిరీస్కు ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా రాలేదని, ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు.
మైక్రో డ్రామాలు తీయడం సాధారణ సినిమాల కంటే చాలా కష్టమని ఆదిత్య అభిప్రాయపడ్డారు. ప్రతి సీన్ ప్రేక్షకుడిని వెంటనే ఆకట్టుకునేలా ఉండాల్సి ఉంటుందని, ఈ ఫార్మాట్లో 80 శాతం సినిమా దర్శకులు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. నటుడు దొరసాయి తేజ, నితిన్ ప్రసన్న, సినిమాటోగ్రాఫర్ అశ్విన్ లెనిన్, సంగీత దర్శకుడు రిషి ఎమ్ అందించిన సహకారం ‘దందా’ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు.
తన తదుపరి ఫీచర్ ఫిల్మ్ కూడా దొరసాయి తేజతోనే ఉంటుందని, అది ‘దందా’ కంటే ఐదు రెట్లు వైల్డ్గా ఉంటుందని ఆదిత్య వెల్లడించారు. ప్రస్తుతం 50 ఏళ్ల నేరస్థుడి నేపథ్యంలో ఓ శక్తివంతమైన కథను సిద్ధం చేస్తున్నానని, ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!