

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన ప్రియురాలు నయనిక రెడ్డితో వచ్చే నెల 6 న హైదరాబాద్లో పెళ్లి జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. గతేడాది అక్టోబర్ 31 న వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. అలాగే వచ్చే నెల 6 వ తేదీ న అల్లు అర్జున్ – స్నేహారెడ్డి దంపతుల పెళ్లి రోజు కావడంతో అల్లు కుటుంబానికి ఆ రోజు మరింత ప్రత్యేకంగా మారింది.
పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రితం దుబాయ్ బీచ్లోని లగ్జరీ యాట్లో శిరీష్ – నయనికల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు బాబీ తదితరులు హాజరయ్యారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతవారం అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమంతో అధికారికంగా పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అల్లు – కొణిదెల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పెళ్లి పత్రికల పంపిణీ కూడా ప్రారంభమై, తొలి ఆహ్వాన పత్రికను చిరంజీవి – సురేఖ దంపతులకు అందజేశారు.
ఇదిలా ఉండగా, అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ఓ ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే వార్త ఫిలింనగర్లో వినిపిస్తోంది. ఈ పార్టీలో అల్లు కుటుంబంతో పాటు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందట. అలాగే ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్లను ప్రత్యేక ఆకర్షణగా ఆహ్వానించనున్నారనే టాక్ ఉంది. అయితే పార్టీ ఎప్పుడు, ఎక్కడ అన్న వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!