

టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ బుకింగ్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు లక్కీడిప్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. రోజుకు గరిష్ఠంగా 1,500 టికెట్లకు మించి జారీ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి తదితర విమానాశ్రయాల నుంచి కూడా శ్రీవాణి కోటా టికెట్లు జారీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో విరాళాలు చెల్లించి దర్శనం పొందని సుమారు 41 వేల మంది భక్తులకు జూన్ నుంచి రోజుకు 300 టికెట్ల చొప్పున కేటాయించి, వచ్చే 5 నుంచి 10 నెలల్లో బ్యాక్లాగ్ను పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
తిరుమలలో పెరుగుతున్న వాహన రద్దీ, కాలుష్యాన్ని తగ్గించేందుకు జూపార్క్ సమీపంలో మెగా పార్కింగ్, వసతి, స్కానింగ్ హబ్ ఏర్పాటు చేసే ప్రణాళికలను టీటీడీ సిద్ధం చేస్తోంది. భక్తులు అక్కడే వాహనాలు పార్క్ చేసి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కొండపైకి వెళ్లేలా చర్యలు చేపట్టనున్నట్లు ఈఓ వెల్లడించారు. సామాన్య భక్తుల నిరీక్షణ సమయం తగ్గించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను నియంత్రించామని చెప్పారు. టీటీడీ ఐటీ విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు రూ.160 కోట్లతో విద్యాసంస్థలను పునర్నిర్మించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను విస్తరించడంతో పాటు, శ్రీవారి సేవలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులను భాగస్వామ్యం చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!