

తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఎజెండాలో ప్రతిపాదించినా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత కేంద్రానికి లేఖలు రాయడం మినహా తెలంగాణ నీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. జీఆర్ఎంబీ ఎజెండాలోని తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను వెంటనే ఉపసంహరించుకునేలా ఏపీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎజెండా నుంచి అంశాలు తొలగించే వరకు జీఆర్ఎంబీ సమావేశానికి హాజరుకాబోమని స్పష్టం చేయాలని కోరారు. ఈ నెల 18న హైదరాబాద్లో సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను చర్చకు తీసుకొస్తే, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో జలసౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ పరిస్థితిపై కూడా హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వ వైద్యం, ప్రస్తుత పాలనలో దయనీయ స్థితికి చేరుకుందని ఆరోపించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో బెడ్ అందుబాటులో లేక ఓ రోగి నేలపై పడుకున్న దృశ్యాన్ని ప్రస్తావిస్తూ, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన పేదలకు సకాలంలో వైద్యం, కనీస సౌకర్యాలు అందకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!