

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం అర్ధరాత్రి గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. నందిపాడు సమీపంలోని అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై ఐదు కార్లు, అంబులెన్స్ను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు (36) కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు వెళ్తున్నారు. నందిపాడు సమీపంలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉండటాన్ని గమనించిన శ్రీనివాసరావు.. అతడికి సాయం చేసేందుకు తన కారును రోడ్డు పక్కన ఆపి 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వచ్చిన అనంతరం సిబ్బందితో కలిసి బాధితుడిని అందులోకి ఎక్కిస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి అంబులెన్స్తో పాటు ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు కారు, అంబులెన్స్ మధ్య చిక్కుకుని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ సిబ్బంది స్వప్నకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మరో రెండు వాహనాల్లో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!