

కొండా సురేఖ కాంగ్రెస్ అగ్రనేతలకు రాసిన లేఖల్లో తనపై జరుగుతున్న రాజకీయ అణచివేత, పరిపాలనా పరమైన నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 22, 23 తేదీల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్కు లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. తన శాఖలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో తనను సంప్రదించడం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా ఆదేశాలు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. మంత్రి హోదాలో తన పాత్రను నామమాత్రంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి నిధుల బదిలీ, శ్రీరామ నవమి ప్రభుత్వ ప్రకటనల్లో తన ఫొటో తొలగింపు వంటి అంశాలను ఆమె లేఖల్లో ప్రస్తావించినట్లు సమాచారం. తన మాజీ ఓఎస్డీ సుమంత్ను తొలగించడం, ఆయనపై కేసుల నమోదు, తన నివాసానికి పోలీసులు రావడం వంటి పరిణామాలపైనా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇవ్వడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళా నేత కావడం వల్లే సెలెక్టివ్గా టార్గెట్ చేస్తున్నారనే భావన ఉందని పేర్కొంటూ, పార్టీ అగ్రనాయకత్వం ఈ అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. లేఖలతో పాటు సంబంధిత వీడియోలు, ఆధారాలతో కూడిన పెన్డ్రైవ్ను కూడా అందజేసినట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!