

వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని ఆరాధించడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. వినాయకుడు జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక అని అన్నారు. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమని తెలిపారు. వినాయక చవితి వేడుకలు సామాజిక స్పృహ, ఐక్యత, సమష్టితత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.
ధార్మిక కార్యక్రమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చంద్రబాబు అన్నారు. వాడవాడలా ఏర్పాటు చేసే వినాయక మండపాలతో జరిగే వేడుకలు చవితికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయని పేర్కొన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మిక చైతన్యానికి వినాయక చవితి వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆయన ప్రార్థించారు. ఏపీ సుభిక్షంగా ఉండటంతో పాటు తెలుగు జాతి వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!