

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలు చవిచూసిన సూచీలు తిరిగి పుంజుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం లభించడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. ఉదయం 9.47 గంటల సమయంలో సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 76,692 వద్ద కదలాడగా, నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 23,948 వద్ద ట్రేడైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా కొంత కోలుకుని 96.18 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగాయి.
అమెరికా దాడులను నిలిపివేస్తే తాము కూడా దాడులు ఆపుతామని ఇరాన్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు కొంత తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 92 డాలర్లకు దిగిరావడం ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్కు సానుకూల పరిణామంగా మారింది. టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చన్న అంచనాలు సైతం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!