

బ్రిక్స్ సదస్సు ప్రారంభానికి ఇంకా 48 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. జిన్పింగ్ భారత్కు వస్తారా? వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ ఉంటుందా? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిన్పింగ్ పర్యటనపై చైనా విదేశాంగ శాఖను ప్రశ్నించగా, ఆయన పర్యటనకు సంబంధించి తమ వద్ద అధికారిక సమాచారం లేదని తెలిపింది. ఆయన భారత్కు వస్తే ఏడు సంవత్సరాల తర్వాత ఇదే తొలి పర్యటన కానుంది. మోదీ-జిన్పింగ్ భేటీ జరిగితే, 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాల నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది.
ఇటీవలి కాలంలో భారత్-చైనా సంబంధాలను క్రమంగా మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ కూడా చైనా ఉత్పత్తులపై 2020లో విధించిన కొన్ని ఆంక్షలను సడలించింది. రాజకీయ విభేదాలు కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలంగానే ఉన్నాయి. గత ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం 12.4 శాతం పెరిగి 155 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. పదేళ్ల క్రితం నమోదైన 71.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటివరకు కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు, భారత్-చైనా పోటీదారులు కాదని, భాగస్వాములని చైనా పేర్కొంది. పరస్పర అభివృద్ధికి అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు సాగాలని జిన్పింగ్, మోదీ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు వాస్తవ సంబంధాల్లో ఎంతవరకు ప్రతిఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!