

వినియోగదారులను ఎక్కువ మొత్తం చెల్లించేలా ప్రేరేపించే సందేశాలు, యాప్ ఇంటర్ఫేస్ విధానాలను నిలిపివేయాలని ప్రముఖ బైక్ ట్యాక్సీ సేవ రాపిడోను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించింది. అలాగే రాపిడోను నిర్వహిస్తున్న రోప్పెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.10 లక్షల జరిమానా విధించింది. రైడ్ బుకింగ్ ప్రక్రియలో ‘క్యాప్టెన్లు ఈ ధరకు అంగీకరించడం లేదు.. రూ.10, రూ.20, రూ.30 పెంచి చూడండి’ వంటి సందేశాలు చూపించడం ద్వారా వినియోగదారులను అధికంగా చెల్లించేలా ప్రభావితం చేసినట్లు సీసీపీఏ పేర్కొంది.
రైడ్ ధరను పెంచితే రైడ్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందనే భావనను ఈ సందేశాలు కలిగిస్తున్నాయని సీసీపీఏ తెలిపింది. అలాగే రాపిడోలోని ‘సెట్ యువర్ ప్రైస్’ ఫీచర్లో ధర పెంచినప్పుడు ఆకుపచ్చ రంగు, తగ్గించినప్పుడు ఎరుపు లేదా నారింజ రంగు కనిపించేలా ఉండటాన్ని కూడా సీసీపీఏ తప్పుబట్టింది. ఈ విధానం వినియోగదారులను అధిక ధర వైపు మళ్లించే ‘కన్ఫర్మ్ షేమింగ్’, ‘ఇంటర్ఫేస్ ఇంటర్ఫీరెన్స్’ అనే డార్క్ ప్యాటర్న్స్గా గుర్తించింది.
రైడ్ బుక్ కాకపోతే అదనపు మొత్తాన్ని చెల్లించమని సూచించే సందేశాలు రైడర్, క్యాప్టెన్ మధ్య జరిగే రియల్టైమ్ సంభాషణలో భాగమేనని రాపిడో వాదించింది. అయితే సీసీపీఏ ఈ వాదనను అంగీకరించలేదు. రైడ్ ప్రారంభం కాకముందే అదనపు మొత్తాన్ని ‘టిప్’గా సూచించడం సముచితం కాదని, సాధారణంగా టిప్ సేవ అందిన తర్వాత స్వచ్ఛందంగా ఇచ్చేది అని పేర్కొంది. ఇదే అంశంపై ఇతర క్యాబ్, బైక్ ట్యాక్సీ సంస్థల విధానాలనూ సీసీపీఏ పరిశీలిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!