

సెమీకండక్టర్ రంగంలో భారత్ కేవలం భాగస్వామ్య దేశంగా కాకుండా ప్రపంచ స్థాయి శక్తిగా ఎదగాలని నీతి ఆయోగ్ సూచించింది. 2035 నాటికి 120 నుంచి 150 బిలియన్ డాలర్ల విలువైన సెమీకండక్టర్ విలువ గొలుసును నిర్మించుకోవాలని నివేదిక పేర్కొంది. ఇందుకు అవసరమైన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతు వరకు ప్రభుత్వం సమకూర్చి పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచాలని సూచించింది.
‘భారత్ సెమీకండక్టర్ పరిశ్రమ భవిష్యత్’ పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం, రాబోయే పదేళ్లలో 135 నుంచి 180 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. రూపకల్పన, తయారీ, అత్యాధునిక ప్యాకేజింగ్, ముడి పదార్థాల ఉత్పత్తి, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పెట్టుబడులు కీలకమని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల పరిశ్రమ వ్యవస్థను దేశీయంగా నిర్మించుకోవాలని నివేదిక సూచించింది.
ప్రస్తుతం దేశంలోని సెమీకండక్టర్ అవసరాల్లో 90 నుంచి 95 శాతం వరకు దిగుమతుల ద్వారానే తీరుతున్నాయని నివేదిక వెల్లడించింది. 2035 నాటికి దేశీయ మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. సాంకేతిక స్వావలంబన, పరిశోధన, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, దీర్ఘకాలిక విధానాల ద్వారా భారత్ ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో కీలక పాత్ర పోషించగలదని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!