

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో భారత మరియు పాకిస్థాన్ ఉద్రిక్తతల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మే నెలలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు, తానే స్వయంగా జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చానని, లేకపోతే అది అణు యుద్ధానికి దారితీసేదని అన్నారు. ఇదే మాటను గతంలో అనేక సార్లు చెప్పిన ట్రంప్, ఈసారి న్యూయార్క్లో జరిగిన సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో మరింత అతిశయోక్తులతో మాట్లాడారు. నేను అడ్డుకోకపోతే అణు బాంబుల ప్రభావం లాస్ ఏంజిల్స్ వరకూ చేరేది అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ట్రంప్ చెప్పిన కథనం ప్రకారం ఆ సమయంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నప్పుడు, ఇద్దరు దేశాధినేతలకు తాను హెచ్చరిక ఇచ్చాడట. మీరు ఆగ్రహం తగ్గించకపోతే రెండు దేశాలపై భారీ సుంకాలు వేస్తాను. అమెరికాతో మీ వ్యాపారం పూర్తిగా నిలిపేస్తాను అని బెదిరించాడట. తన హెచ్చరికలతోనే రెండు దేశాలు వెనక్కి తగ్గాయని, దీంతో తాను లక్షలాది మంది ప్రాణాలు కాపాడానని అన్నారు.
ఇవన్నీ చెప్పడమే కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ తనకే ఫోన్ చేసి, మేం యుద్ధాన్ని ఆపేశాం అని చెప్పారని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా తనను సంప్రదించి ధన్యవాదాలు చెప్పారని అన్నారు. ఇలాంటి పరిస్థితులను తానే ఎదుర్కోగలనని, అమెరికా చరిత్రలో ఎవ్వరూ తాను చేసినంతకు చేరలేరని కూడా పొగడ్తల వర్షం కురిపించారు.
అయితే వాస్తవ పరిస్థితులు వేరేవి. ఏప్రిల్లో పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత, భారత్ మే 7 న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఆ తర్వాత మే 10 న ఇరు దేశాల మిలిటరీ అధికారులు మాట్లాడి, కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది పూర్తిగా రెండు దేశాల నిర్ణయం.
భారత్ ప్రభుత్వం కూడా ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, తమ సమస్యలను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, మూడో వ్యక్తి జోక్యం లేకుండానే సమస్యను పరిష్కరించుకున్నామని స్పష్టం చేసింది. అయినా కూడా ట్రంప్ మాత్రం ఈ అణు యుద్ధం అడ్డుకున్న కథను తన ఇమేజ్ కోసం మళ్లీ మళ్లీ చెబుతూ వస్తున్నారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!