

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం 15 వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తాజాగా రూ. 387 కోట్లు విడుదల చేసింది. ఇదివరకే మొదటి విడతగా రూ. 259.36 కోట్లు అందించగా, తాజా విడతతో కలిపి మొత్తం రూ. 646.36 కోట్లు రాష్ట్రానికి అందినట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించి, కేంద్రం కోరిన అన్ని నివేదికలు మరియు నిధుల వినియోగ వివరాలు సమర్పించిన అనంతరం నిబంధనల ప్రకారం ఈ నిధులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు వినియోగించనున్నారు.
అయితే 15 వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు సుమారు రూ. 3,000 కోట్లు రావాల్సి ఉండగా, దాదాపు రూ. 2,400 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రామాల సమగ్రాభివృద్ధి మరియు స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం దృష్ట్యా పెండింగ్ నిధులను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దానసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకమని ఆమె స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!