

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌస్’లో బస చేయడం మళ్లీ ఈ భవనాన్ని చర్చల్లోకి తెచ్చింది. ప్రధానమంత్రి మోదీ విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి, కీలక చర్చలు నిర్వహించడానికి ఈ భవనాన్నే ప్రధాన వేదికగా ఉపయోగిస్తారు. కానీ ఇది ప్రభుత్వ భవనంగా మారకముందు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన ప్రతిష్టను ప్రతిబింబించేలా నిర్మించిన వ్యక్తిగత రాజప్రాసాదం.
బ్రిటిష్ వారు రాజధానిని ఢిల్లీకి మార్చిన సమయంలో నిజాం నవాబు అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక గెస్ట్ హౌస్ ఉండాలని నిర్ణయించుకున్నారు. అది కూడా అప్పటి వైస్రాయ్ హౌస్ (ప్రస్తుతం రాష్ట్రపతి భవన్)కి ఏమాత్రం తగ్గకుండా ఉండాలని భావించి, ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటియన్స్తో ఇండో–యూరోపియన్ శైలిలో సీతాకోకచిలుక ఆకారంతో ఈ భవనాన్ని డిజైన్ చేయించారు. ఈ భవనంలో మొత్తం 36 గదులు, విశాలమైన కోర్ట్ యార్డ్స్, ఫౌంటెన్లు ఉన్నాయి. దీని నిర్మాణానికి 1920లలోనే నిజాం ఏకంగా 2 లక్షల పౌండ్లు ఖర్చు చేశారు. నేటి లెక్కల్లో చూస్తే దీని విలువ సుమారు 170 కోట్ల రూపాయలు ఉంటుంది. అప్పట్లో నిజాంకు ఉన్న అపార సంపదకు, ఆయన అభిరుచికి ఈ భవనం ఒక నిలువెత్తు సాక్ష్యం.
స్వాతంత్ర్యం తర్వాత సంస్థానాల విలీనంతో హైదరాబాద్ హౌస్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. 1974లో విదేశాంగ శాఖ దీని బాధ్యతలు స్వీకరించింది. అప్పటి నుంచి ఇది విదేశీ అధినేతలకు ఆతిథ్యం ఇచ్చే ప్రతిష్టాత్మక కేంద్రంగా మారింది. అశోక్ రోడ్ నంబర్ 1లో ఉన్న ఈ భవనం ఇప్పుడు భారత దౌత్య సంబంధాలకు ప్రధాన కార్యాలయంగా మారింది. గతంలో బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఇప్పుడు పుతిన్ వంటి ప్రపంచ అగ్రనేతలు ఇక్కడే మన ప్రధానులతో భేటీ అయ్యారు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుడి విలాసానికి చిరునామాగా ఉన్న ఈ భవనం, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులు కలుసుకునే వేదికగా మారడం విశేషం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!