

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసిందని ఆరోపిస్తూ బీజేపీ ‘వెయ్యి రోజులు.. వెయ్యి అక్రమాలు.. వెయ్యి అబద్ధాలు’ పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ ఛార్జ్షీట్ను విడుదల చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్ల పెంపు వంటి హామీల అమలుపైనా ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రంలో అభివృద్ధి, శాంతిభద్రతలు క్షీణించాయని, విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ ఖాళీలు, మౌలిక సదుపాయాల సమస్యలు కొనసాగుతున్నాయని బీజేపీ విమర్శించింది. భూభారతి, 22ఏ అంశాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపడతామని ప్రకటించింది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వ్యయం, పర్యావరణ అనుమతులు, డీపీఆర్లపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నిలదీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!