

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయిన అనంతరం ఈ వివరాలు వెల్లడించారు. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతికంగా అనుకూలంగా లేవని తేలడంతో, తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో పాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన తర్వాత కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం, జిల్లా ప్రజల దీర్ఘకాలిక విమానాశ్రయ ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇదే సమయంలో మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!