

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేబినెట్లోని మంత్రులకు వారి శాఖలపై పూర్తి అధికారం, స్వేచ్ఛ కల్పించాలని సూచించారు. మంత్రులకు తగిన స్వేచ్ఛ ఇవ్వకపోతే భవిష్యత్లో కొత్త సమస్యలు తలెత్తి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుశ్మిత చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదని అన్నారు.
రాష్ట్రంలో భూ సమస్యలపై కూడా కూనంనేని అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు కోటి ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం మరింత చురుగ్గా స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిషేధిత జాబితాలోని భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!