

వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కల అని, తమ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తి చేసి 2024లో జాతికి అంకితం చేశామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు లక్షలాది మంది రైతులకు సాగునీరు, ఫ్లోరోసిస్ ప్రభావిత కుటుంబాలకు రక్షిత తాగునీరు అందించే సంజీవనిగా మారుతుందని ఆయన అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం క్రెడిట్ తీసుకునే ప్రయత్నంగా ఉందని జగన్ విమర్శించారు. ప్రాజెక్టుకు ప్రాణమైన 37.587 కిలోమీటర్ల జంట సొరంగాల్లో వైఎస్ఆర్ హయాంలో 20.333 కిలోమీటర్లు, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 6.686 కిలోమీటర్లు, తమ ప్రభుత్వ హయాంలో మిగిలిన 10.568 కిలోమీటర్ల తవ్వకం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తి చేసి, 2024 మార్చి 6న జాతికి అంకితం చేసినట్లు తెలిపారు.
వెలిగొండతో పాటు పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులను పూర్తి చేయాలని జగన్ డిమాండ్ చేశారు. నిర్వాసితుల పునరావాసం, పరిహారం పూర్తిగా అందించకుండా ప్రజలను ఖాళీ చేయిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. నల్లమలసాగర్ను నింపి రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు రక్షిత తాగునీరు అందించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!