

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు దేశంలోని ఇతర రంగాలకూ గణనీయమైన ఊతమిచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ వివిధ రంగాలు మెరుగ్గా రాణించడానికి జీఎస్టీ సంస్కరణలు కీలకంగా పనిచేశాయని పేర్కొన్నారు. ఈ పన్ను మార్పులు ఆర్థిక వ్యవస్థకు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన రక్షణ కల్పించాయని తెలిపారు. కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి భార్గవ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం చిన్న కార్ల మార్కెట్ వేగంగా పుంజుకుంటోందని భార్గవ తెలిపారు. గత ఐదేళ్లలో నమోదైన వృద్ధి కంటే గతేడాది సెప్టెంబరులో ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు ఈ రంగానికి మరింత ఊతమిచ్చాయని అన్నారు. జీఎస్టీ మార్పుల వల్ల ఆటో రంగానికే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకు కూడా ప్రయోజనం కలిగిందని చెప్పారు. దేశ జీడీపీ అంచనాల కంటే మెరుగ్గా రాణిస్తోందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, భారత పోటీతత్వాన్ని పెంచడం, విస్తృత ఆర్థిక కార్యకలాపాల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అవసరమైన సంస్కరణలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. దేశ బలం దాని ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని భార్గవ అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!