

కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీ.జీ. భరత్ స్పష్టం చేశారు. ఈ అంశం పై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లతో కలిసి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి కర్నూలులోని ఏ, బీ, సీ క్యాంపుల్లో స్థలాల పై ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. హైకోర్టు బెంచ్తో పాటు కొత్త కలెక్టరేట్ భవనం కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఆదివారం కర్నూలులో న్యాయవాదులు నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ స్థాయిలో తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పై చిల్లర రాజకీయాలు ఆపాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేయాలనే ఉద్దేశంతో వైసీపీ చేసిన మద్యం బాటిళ్ల వ్యవహారం పూర్తిగా బయటపడిందని మంత్రి మండిపడ్డారు. టెక్నాలజీని ఉపయోగించి ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చామని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు వచ్చినా వైసీపీ నేతల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు దగ్గరవ్వాలనే ఆలోచన వారికి లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.
తిరుమల పవిత్రతను కాపాడటం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ యలమంచి బాలాజీ, ప్రభుత్వ న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!