

హైటెక్స్లో బయోఏషియా 2026 సదస్సును ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభిస్తూ తెలంగాణను ప్రపంచ జీవవిజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 23 సంవత్సరాల క్రితం బయోఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్వేర్ నగరంగా మాత్రమే గుర్తింపు పొందిందని, నేడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఎదిగిందని చెప్పారు. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల సహకారంతో హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్ రంగాల్లో ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందన్నారు. గత రెండు సంవత్సరాల్లో జీవవిజ్ఞాన రంగంలో 73,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. దావోస్లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని, జీనోమ్ వ్యాలీ విస్తరణ, వన్ బయో ప్రారంభం, గ్రీన్ ఫార్మా సిటీ వేగవంతం వంటి కీలక చర్యలు చేపట్టామని వివరించారు.
దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరహాలో బయోఏషియా అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రకారం 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్స్, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దేశ విదేశీ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. తెలంగాణ ప్రపంచానికి సిద్ధంగా ఉందని, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!