

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుబంధు, రైతు భరోసా వంటి పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకు కూడా రైతుబంధు ఇవ్వాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులకు సహాయం అందించడంలో విఫలమయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలోనే నిధులు విడుదల చేస్తున్నారని, ఈ నెల 30న విడుదల కూడా ఎన్నికల సూచికేనని వ్యాఖ్యానించారు. భారాస మళ్లీ అధికారంలోకి వస్తే యూరియా యాప్ను రద్దు చేస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు ద్వారా రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి నిధులు తీసుకురాలేదని విమర్శించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ హెచ్చరికలను పట్టించుకోకుండా కాంగ్రెస్కు ఓటు వేసిన ఫలితాన్ని ప్రజలు ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల బోనస్ను తగ్గించిందని, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు కూడా అందించలేకపోతున్నదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 చెల్లిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ముఖ్యమైన శాఖలు జిల్లాకు చెందిన మంత్రుల చేతిలో ఉన్నప్పటికీ ప్రజలకు లాభం చేకూరలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!