

ప్రపంచ స్థాయి పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని దావోస్కు పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ప్రతినిధి బృందంతో కలిసి ఈ పర్యటనకు బయలుదేరుతున్నారు.
సోమవారం ఉదయం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా జాతరను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావోస్కు బయలుదేరనున్నారు.
ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ బహుళజాతి సంస్థల సీఈఓలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. దావోస్లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, ఎల్ఓరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో విడివిడిగా భేటీ కానున్నారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు.
ఈ సమావేశాల్లో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, కృత్రిమ మేధస్సు (AI), లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో ఉన్న అనుకూలతల పై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ ను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి ఉన్న అవకాశాలను అంతర్జాతీయ వేదిక పై వివరించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ దావోస్ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి సహా ఉన్నతాధికారుల బృందం పాల్గొననుంది.













.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!