

డీలిమిటేషన్, పార్లమెంట్ స్థానాల 50 శాతం పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎంపీ స్థానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న అంతరానికి సమానంగా సీట్ల పెంపు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం, వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు.
దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ అంశంపై పోరాటానికి సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 50 శాతం సీట్ల పెంపు ఏ లెక్కల ఆధారంగా జరుగుతుందో స్పష్టత అవసరమని ప్రశ్నించారు. ఈ పెంపు తుది నిర్ణయంగా మారితే అది దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే “ఫైనల్ బుల్లెట్”లా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు జరిగితే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల అవసరం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.
50 శాతం సీట్ల పెంపు కారణంగా జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని సీఎం తెలిపారు. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి ముందుకు వెళ్లాలని సూచించారు. నియోజకవర్గాల పెంపు దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకమని పేర్కొన్న ఆయన, ఉత్తర–దక్షిణ భారత మధ్య అంతరాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పెంచుతోందని ఆరోపించారు. ఈ అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి తీసుకెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఒక తెలుగు న్యూస్ ఛానెల్తో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!