

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రంలోకి ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. లండన్లో ఆయన రోల్స్ రాయిస్ గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నిక్కీ గ్రేడీ స్మిత్ను కలసి ఏరోస్పేస్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం సాంకేతికంగా వేగంగా ఎదుగుతోందని, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూల విధానాలు ఉన్నాయని వివరించారు. ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పరిశ్రమల కోసం ఉత్తమ గమ్యస్థానంగా నిలబెడతాయని చెప్పారు.
ఒర్వకల్లో మిలటరీ ఎయిర్స్ట్రిప్, మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాలింగ్ (MRO) సౌకర్యాల ఏర్పాటు ప్రతిపాదనను చంద్రబాబు ముందుంచారు. అలాగే ఏరోస్పేస్ కాంపోనెంట్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని రోల్స్ రాయిస్ను ఆహ్వానించారు.
విశాఖపట్నం, తిరుపతిని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) స్థాపనకు అనువైన నగరాలుగా సూచించారు. భోగాపురం విమానాశ్రయం కూడా పూర్తి స్థాయి ఏవియేషన్ ఎకోసిస్టంగా ఎదిగే సామర్థ్యం ఉందని తెలిపారు. రోల్స్ రాయిస్తో పాటు SRAM & MRAM గ్రూప్, షామ్కో హోల్డింగ్స్ చైర్మన్లతో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు. సెమీకండక్టర్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగాల్లో పెట్టుబడులపై చర్చలు సాగాయి. ఈ రంగాలపై రెండు సంస్థలు కూడా ఆసక్తి చూపాయి.
ఈ పర్యటనతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో ఏరోస్పేస్, హైటెక్ తయారీ రంగాల్లో ముందంజలో నిలిపే దిశగా అడుగులు వేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!