

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కలిసి రాష్ట్రం యొక్క గ్లోబల్ ఇమేజ్ను మరింత బలపర్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఈ దిశలో వారు తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపించాయి. ఈ గ్లోబల్ అవుట్రీచ్లో భాగంగా చంద్రబాబు బ్లూమ్బర్గ్కి ఇంటర్వ్యూ ఇవ్వగా, లోకేష్ రాయిటర్స్తో ప్రత్యేక సంభాషణలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలో లోకేష్ రాష్ట్రానికి ఉన్న విస్తృత దృష్టికోణాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోని సాంస్కృతిక కేంద్రంగానే కాకుండా అత్యాధునిక టెక్నాలజీ హబ్గా కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేశారు. తండ్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలో అత్యంత ప్రాధాన్యమైన ఇన్వెస్ట్మెంట్ గమ్యస్థానంగా మార్చగలమనే నమ్మకాన్ని లోకేష్ వెల్లడించారు.
రాయిటర్స్ తమ రిపోర్టులో లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ ఉత్సాహానికి ప్రధాన కారకాలలో ఒకరని పేర్కొంది. ప్రధాని మోదీకి సన్నిహితుడిగా, విజనరీ సీఎంగా పేరుగాంచిన చంద్రబాబుకు వారసుడిగా, లోకేష్ గ్లోబల్ కంపెనీలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించింది. దీనిపైన స్పందించిన లోకేష్, కేవలం పదహారు నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రప్పించడం పారదర్శకత, వ్యాపార వేగం, ధైర్యవంతమైన సంస్కరణల పట్ల తమ కట్టుబాటుకు నిదర్శనమని తెలిపారు. ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలబెడుతున్నాయని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!