

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ కీలక ప్రతిపాదన చేశారు. చట్టసభల్లో 40 ఏళ్ల లోపు యువతకు కనీసం 33 శాతం సీట్లను రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేయాలని సూచించారు. గోవాలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) పశ్చిమ ప్రాంత సదస్సులో ‘దేశాభివృద్ధిలో యువ శాసనకర్తల పాత్ర’ అనే అంశంపై ప్రసంగించిన ఆయన, దేశంలో సగటు పౌరుడి వయసు 32 ఏళ్లు కాగా, లోక్సభ సభ్యుల సగటు వయసు 56, ఏపీ శాసనసభ్యుల సగటు వయసు 53 సంవత్సరాలు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. సగటు ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల మధ్య దాదాపు 20 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉండటం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే 18వ లోక్సభలో 40 ఏళ్ల లోపు యువత శాతం కేవలం 11 మాత్రమే ఉండగా, ఏపీ అసెంబ్లీలో ఇది 7 శాతానికే పరిమితమైందని వివరించారు.
చట్టసభల్లో కొంతమంది ప్రజాప్రతినిధుల ప్రవర్తన కారణంగా యువత రాజకీయాలపై ఆసక్తి కోల్పోతున్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరు ఆదర్శప్రాయంగా ఉంటేనే యువతకు రాజకీయాలపై గౌరవం పెరుగుతుందని అన్నారు. విద్యార్థి దశలో రాజకీయాలకు అవకాశాలు తగ్గిపోవడం, విశ్వవిద్యాలయాల నుంచి నాయకులు రాకపోవడం కూడా దీనికి కారణమని చెప్పారు. 1982లో ఎన్టీ రామారావు యువతకు అవకాశాలు కల్పించడం వల్లే తాను 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా అవతరించానని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ల మాదిరిగానే చట్టసభల్లో యువతకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై విమర్శలు వచ్చినా, యువతను చట్టసభల్లోకి తీసుకురావడం ద్వారా కొత్త ఆలోచనలతో దేశానికి మెరుగైన భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.















.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!