

1. వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై RTO కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదు.
2. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం నేటి నుంచే అమల్లోకి వచ్చింది.
3. నిన్న మాదాపూర్లో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది.
4. ఇకపై వాహనం కొనుగోలు చేసిన అదే షోరూమ్లో ఫొటోలు, అవసరమైన డాక్యుమెంట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ పొందవచ్చు.
5. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నేరుగా పోస్టు ద్వారా ఇంటికే పంపించబడుతుంది.
నేటి నుంచి రవాణా శాఖలో కీలక సంస్కరణలు అమలులోకి వచ్చాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వాహనదారులు ఇకపై శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాహనం కొనుగోలు చేసిన అదే షోరూమ్ వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ నిర్ణయం ప్రజలకు సమయం, శ్రమను ఆదా చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
రవాణా శాఖలోని అన్ని సేవలను ఆన్లైన్లోనే అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందని మంత్రి తెలిపారు. ‘సారథి’ ప్లాట్ఫామ్లో తెలంగాణ చేరడంతో రవాణా సేవలు మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈవీ పాలసీ, వాహన స్క్రాప్ పాలసీ వంటి ఆధునిక విధానాలను ప్రవేశపెట్టి రవాణా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!