

సీలేరు జిల్లా గూడెంకొత్తవీధి మండలం ధారకొండ ఆశ్రమోన్నత పాఠశాలలో భోజనం బాగోలేదని ప్రశ్నించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు చితకబాదిన ఘటన కలకలం రేపింది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం, గురువారం మధ్యాహ్నం 8, 9 తరగతులకు చెందిన విద్యార్థులు హెచ్ఎం హేమచంద్రను కలిసి పాఠశాలలో భోజనాలు సక్రమంగా లేవని, మెనూ ప్రకారం వడ్డించేలా చూడాలని కోరారు. దీంతో ఆగ్రహం చెందిన హెచ్ఎం గుమ్మిరేవుల పంచాయతీ చోడిరాయికు చెందిన విజయ్కుమార్, ధారకొండ ఒడియా క్యాంప్కు చెందిన ప్రభుదాస్లపై దాడి చేసినట్లు తెలిపారు.
దాడి అనంతరం విజయ్కుమార్కు ఫిట్స్ వచ్చి పాఠశాలలోనే కుప్పకూలగా, ప్రభుదాస్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారిని ధారకొండ పీహెచ్సీకి తరలించి వైద్యాధికారి బాబ్జి ఆక్సిజన్ అందించి ఇంజెక్షన్లు వేశారు. మెరుగైన చికిత్స కోసం విద్యార్థులను నర్సీపట్నం తరలించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఎల్ఎంసీ ఛైర్మన్ మణి ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. స్థానికులు కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి ఎ.బుజ్జిబాబు డిమాండ్ చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!