

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థరెడ్డి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష మృతి చెందింది. కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తాగిన ఘటనలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో సిద్ధార్థరెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ప్రత్యూష మృతి ఆత్మహత్య కాదని, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపిస్తూ ఆమె తల్లి దీర్ఘకాలం న్యాయపోరాటం చేశారు. ట్రయల్ కోర్టు సిద్ధార్థరెడ్డిని దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం తెలంగాణ హైకోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్ను కొట్టేసింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించడంతో అమెరికాలో ఉన్న అతడు భారత్కు వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్లో ఉన్న ఒక కాలేజీలో ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్ చదువుకోగా, ప్రత్యూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదట ప్రత్యూష తల్లి వారి వివాహానికి వ్యతిరేకించినప్పటికీ తరువాత అంగీకరించారు. అయితే సిద్ధార్థరెడ్డి తల్లి మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం వివాహానికి అడ్డంకిగా మారింది. 2002 ఫిబ్రవరి 23న ఈ విషయాన్ని సిద్ధార్థరెడ్డి ఫోన్ ద్వారా ప్రత్యూషకు తెలిపాడు. అదే రోజు సాయంత్రం పంజాగుట్టలోని బ్యూటీ పార్లర్ నుంచి ఆమెను తీసుకుని కారులో బయలుదేరారు. రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్య ఇద్దరూ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి ప్రాణాపాయ స్థితిలో చేరారు. ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూశారు, సిద్ధార్థరెడ్డి మార్చి 9న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!