

చేతిలో సెల్ఫోన్, అపరిమిత డేటా ఉంటే చాలు అన్నట్టుగా సామాజిక మాధ్యమాలను కొందరు అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. భావస్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారం పోస్టులు పెట్టడం, నిషేధిత యాప్లను ప్రమోట్ చేయడం, లక్కీ డ్రా అంటూ అమాయకులను మోసగించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. తక్కువ ధరకే కార్లు, విల్లాలు, స్థలాలు దక్కుతాయంటూ తప్పుడు వీడియోలు రూపొందించిన 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో బాధ్యత లేకుండా వీడియోలు, పోస్టులు పెట్టవద్దని నగర కొత్వాల్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇటీవల అగ్నిప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిపై ఓ యూట్యూబర్ అవమానకర వీడియో రూపొందించడం, వాట్సప్ గ్రూపుల్లో షేర్ కావడంతో గొడవలకు దారి తీసింది. ఈ ఘటనలో యూట్యూబర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నగర శివారులో జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అతివాద స్పందనలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ అనంతరం సినీ ప్రముఖులు, పోలీసు అధికారులపై హద్దులు దాటి ట్రోలింగ్ చేయడంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు విదేశాల్లో ఉంటూ స్థానిక యూట్యూబ్ ఛానళ్లకు ఆర్థిక సాయం చేసి రెచ్చగొట్టే వీడియోలు రూపొందించేందుకు సూచనలు ఇస్తున్నట్టు గుర్తించారు. రాబోయే పండుగలు, ఎన్నికల నేపథ్యంలో పోలీసు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!