

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కొత్త కోనేరు నిర్మించాలని ఆలయ పాలకమండలి నిర్ణయించింది. ఆలయానికి మూడు వైపులా మాడవీధులు విశాలంగా ఉన్నప్పటికీ, ముందు భాగంలో ఉన్న పుష్కరిణి కారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత పుష్కరిణిని పూడ్చివేసి, సమీపంలోని సుపథ మండపానికి సుమారు 60 అడుగుల దూరంలో కొత్త కోనేరు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనికి సుమారు రూ.3.40 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. నిర్మాణానికి అవసరమైన స్థలంలో ఉన్న కొన్ని భవనాలను తొలగించనున్నారు. ఈ పనులకు దేవాదాయశాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
కొత్త పుష్కరిణి నిర్మాణానికి ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆలయ పాలకమండలి తెలిపింది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి ఈ కోనేరు భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఉన్న పుష్కరిణి 140 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుతో ఉంది. అదే కొలతలతో కొత్త కోనేరు నిర్మించేందుకు ఆలయ ఇంజినీరింగ్ విభాగం ప్రణాళిక సిద్ధం చేసింది. పాత పుష్కరిణిలో ఉన్న రాళ్లను ఉపయోగించడంతో పాటు కొత్త అలంకరణలు కూడా చేయనున్నారు.
కోనేరు చుట్టూ శిల్పకళతో ఆకట్టుకునేలా పాత ఆలయ రాతి స్తంభాలను వినియోగిస్తారు. కోనేరు మధ్యలో రాతితో ప్రత్యేక నీరాజన మండపం నిర్మించి అందులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. పుష్కరిణిలోకి దిగేందుకు నాలుగు వైపులా ద్వారాలు, బారికేడ్లు ఏర్పాటు చేస్తారు.
నీరు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేస్తారు. అలాగే రాత్రివేళ కోనేరు చుట్టూ అందంగా కనిపించేలా విద్యుత్ దీపాలంకరణ కూడా చేయనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!