.png&w=3840&q=75)

విశాఖపట్నంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడం, ముఖ్యంగా విశాఖలో ఐటీ రంగ అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖపట్నం వేగంగా ఐటీ మరియు డేటా సెంటర్ హబ్గా మారుతోందని లోకేష్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయని వివరించారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుందని కూడా చెప్పారు.
విశాఖలో 20 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC), క్లౌడ్ సేవలు, బీపీఎం సేవల కేంద్రాలను ఏర్పాటు చేయాలని లోకేష్ క్యాప్ జెమినీకి సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. క్వాంటం టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు సస్టైనబిలిటీ రంగాల్లో కూడా భాగస్వామ్యం పెంచాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాలని కూడా మంత్రి విజ్ఞప్తి చేశారు.
దీనికి స్పందించిన క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ మాట్లాడుతూ తమ సంస్థ 1967లో పారిస్ కేంద్రంగా ప్రారంభమై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.4 లక్షల మంది ఉద్యోగులతో పనిచేస్తోందని చెప్పారు. అందులో సుమారు 2 లక్షల మంది భారత్లోనే ఉన్నారని తెలిపారు. స్ట్రాటజీ, క్లౌడ్, డేటా, ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సేవలను అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్, చెన్నై, ముంబయి, పూణే, నోయిడా, కోల్కతా, గురుగ్రామ్, భువనేశ్వర్ సహా 13 నగరాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ పాల్గొన్నారు. ఈ సంస్థ వార్షిక ఆదాయం సుమారు 23.9 బిలియన్ డాలర్లు.

.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!