

మేడారం జాతరకు వచ్చిన లక్షలాది భక్తుల ఆరోగ్యం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సురక్షిత మంచినీరు, ముమ్మర పారిశుధ్యం, జంపన్న వాగులో నీటి కలుషితం నివారణ చర్యలతో పాటు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. జాతర ప్రధాన వేదిక సమీపంలో టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయగా, 30 ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 5,192 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బంది, 649 వైద్యాధికారులు, 154 ఆయుష్ డాక్టర్లు, 673 నర్సులు, 1,905 ఆశావర్కర్లు, 1,111 పారామెడికల్స్, 331 సూపర్వైజర్లు, 700 ఇతర సిబ్బందిని విధుల్లో నియమించారు.
జాతర అనంతరం కూడా స్థానికుల ఆరోగ్యం రక్షించడానికి 10 మెడికల్ క్యాంపులు, మేడారం చుట్టుపక్కల ఏటూరు నాగారం, ములుగు, పసరా, గోవిందా రావుపేట, మంగపేట సీసీ ఆస్పత్రులను పటిష్టం చేశారు. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసే సందర్భంలో ప్రమాదాలు రాకుండా 325 మంది స్విమ్మర్లు, సింగరేణి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని నియమించారు. వీరందరికీ లైఫ్ జాకెట్లు, సెర్చ్ లైట్స్, లైఫ్ సేవింగ్ పరికరాలు అందించారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ 15 ఫైర్ బ్రిగేడ్స్, 12 మిస్ట్ బుల్లెట్లు, 2 ఫైర్ ఇంజన్లతో 268 ఫైర్ సిబ్బందిని నియమించి అగ్నిప్రమాదాలు నివారించే చర్యలు చేపట్టింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!