

జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిపుత్రుల మధ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మరియు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస రావు, రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య తదితరులు కూడా హాజరయ్యారు.

ఈ వేడుకలను భారీ వేదికలు, హోర్డింగులు లేకుండా ప్రకృతి ఒడిలోనే వినూత్నంగా నిర్వహించారు. పాడేరు నియోజకవర్గంలోని ఓనూరు, నందిగరువు వంటి మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అడవితల్లి బాట కార్యక్రమంలో నిర్మించిన రోడ్ల నాణ్యతను కాలినడకన పరిశీలించారు. అలాగే జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి సదుపాయాలను కూడా పరిశీలించారు.
గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలలను కూడా పరిశీలించారు. తాగునీటి సౌకర్యం కల్పించడానికి నిధులు అందించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకు కృతజ్ఞతలు తెలిపారు. ఓనూరు కూడలి వద్ద ఏర్పాటు చేసిన కొత్త జెండా స్థూపాన్ని ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!