

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర విద్యా–ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర రాష్ట్ర మంత్రులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే మాట్లాడుతూ, గూగుల్ ఇండియా ఏఐ హబ్కు జరిగిన ఈ శంకుస్థాపన 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి పునాది రాయిగా నిలుస్తుందని అన్నారు. ఏఐ యుగంలో విశాఖలో ఏర్పడుతున్న ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషించనుందని, భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
గ్లోబల్ ఏఐ ఆర్థిక వ్యవస్థలో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు. ముంబై, చెన్నైలతో పాటు విశాఖ కూడా అంతర్జాతీయ సబ్సీ గేట్వేగా ఎదుగుతోందని, కొత్త ఫైబర్ ఆప్టిక్ లైన్ల ద్వారా ఇతర ప్రాంతాలతో అనుసంధానం మరింత బలపడుతుందని చెప్పారు. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ డేటా సెంటర్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, అధునాతన క్లౌడ్ మరియు ఏఐ శిక్షణ, మహిళలకు మైక్రో ఎంటర్ప్రైజ్ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. అలాగే కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల ద్వారా ఇంధన భద్రత కల్పించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రాంతీయ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని తెలిపారు.














.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!