

అమరావతి: జల్ జీవన్ మిషన్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వర్చువల్గా మాట్లాడిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సంప్రదింపులు జరిపారని పేర్కొంటూ, మిషన్ పొడిగింపుకు ఆయన చేసిన ప్రతిపాదనకు కృతజ్ఞతలు తెలిపారు.
జల్ జీవన్ మిషన్ మొదటి దశలో ఇప్పటివరకు 16 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లు అందించినట్లు ఆయన వివరించారు. ప్రాజెక్టులో ఏర్పడిన కొన్ని లోపాలను సరిదిద్దుతూ నిర్వహణను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇంకా దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీరు అందించాల్సి ఉందని చెప్పారు. 2024కు ముందు మంజూరు చేసిన పథకాలకు అనుగుణంగానే ఈ మిషన్ పొడిగింపు జరిగిందని స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నీటి నాణ్యత పరీక్షల కోసం డ్వాక్రా మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది మహిళలకు నీటి కోసం దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తొలగుతాయని మంత్రి పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడం కీలకమని ఆయన అన్నారు. రైతులకు సాగు అవసరాల కోసం కూడా సమయానికి నీటి సరఫరా జరగాలని అభిప్రాయపడ్డారు. జేజేఎం 2.0పై త్వరలో ఆంధ్రప్రదేశ్ జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించి లక్ష్యాలను నిర్దేశించుకుందామని సూచించారు. అలాగే పీఎం జన్మన్, పీఎం జన భాగీదారీ మిషన్ల కింద కూడా మారుమూల ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరాకు నిధులను వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమాల అమలుకు కేంద్రం పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్ దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు.



















.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!