

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మేడారంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ఈసారి జాతర నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైన రామప్ప ఆలయానికి మొట్టమొదటిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు వచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇది తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచిందన్నారు.
మేడారం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన కట్టడాలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు హర్షణీయమని పేర్కొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మేడారం ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే గిరిజన యువత విద్య, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని కిషన్ రెడ్డి అన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వారి సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!