

అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో నేనున్నాను ఒకటి. ఒక సమయంలో వరుస ఫ్లాపులతో ఒత్తిడిలో ఉన్న నాగార్జున, 2002 లో వచ్చిన సంతోషం సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు. ఆ విజయాల సరళిలో నేనున్నాను కూడా చోటు దక్కించుకుంది. మనసంతా నువ్వే దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, నాగ్కు అత్యంత సన్నిహిత నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా విడుదలైన మొదటి రోజుల్లో మాత్రం స్పందన అంత ఆశాజనకంగా లేకపోవడంతో, ఆదిత్యతో పాటు మొత్తం టీమ్ నిరాశ చెందిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పట్లో అందరికీ ఇది ఫ్లాప్ అన్న నిరాశే ఎక్కువగా కనిపించిందని చెప్పారు. కానీ గుంటూరులోని ఒక థియేటర్ యజమాని చెప్పిన మాటలు వారి నమ్మకాన్ని తిరిగి నిలబెట్టాయని ఆదిత్య గుర్తుచేసుకున్నారు.
ఆదిత్య చెప్పిన ప్రకారం తన అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా చూసి నాగార్జున ఇంటర్వెల్కు ముందు చెప్పే ఓటమిని ఒప్పుకోవడం కూడా ధైర్యమే అనే డైలాగ్ను గుర్తుచేసినప్పుడు, నిజంగా సినిమా ఆడకపోతుందేమో అనే ఆలోచన తనను కాస్త కలిచివేసిందట. దీంతో థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూడాలని ఆయన టీంతో కలిసి కొన్ని చోట్లకు వెళ్లారు.
మిడ్ సమ్మర్ సమయంలో గుంటూరులోని ఒక థియేటర్కి వెళ్లిన ఆదిత్య, అక్కడ ఎయిర్ కండిషనింగ్ పనిచేయకపోవడంతో హాల్ డోర్లు తెరిచి ఉంచిన విషయం చెప్పారు. ఆ సమయంలో వేణుమాధవా పాట వస్తుండగా, ప్రేక్షకులు శాంతిగా చూస్తూ ఉండటం, ఆ తర్వాత వేసవి కాలం వెన్నెల్లాగా పాట వచ్చినా బయటకు వెళ్లకపోవడం దర్శకుడికి ఆశ్చర్యంగా అనిపించిందట.
తమకు ఇది ఫ్లాప్ అనిపించినా, థియేటర్ మేనేజర్ మాత్రం భిన్నంగా చెప్పారు. సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉంటే, పాటలు వచ్చాక ప్రేక్షకులు వెంటనే బయటికి వెళ్లిపోతారు. కానీ మీ సినిమా చూస్తున్న వారు హాల్ నుంచి కదలడం లేదు. అంటే వాళ్లు కథలో పూర్తిగా ఇమిడిపోయారు అని చెప్పడంతో తాము సినిమా మీద నమ్మకం పెంచుకున్నామని ఆదిత్య తెలిపారు. మేనేజర్ చెప్పినట్టుగానే, ‘నేనున్నాను’ చివరకు పెద్ద హిట్గా నిలిచి, 40కి పైగా సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!