

మొఘలుల జెండాను చూసి చిన్ననాటి శివాజీ “మనకంటూ సొంత జెండా ఎందుకు లేదు?” అని ప్రశ్నించిన సందర్భంతో ప్రారంభమయ్యే కథనే ‘రాజా శివాజీ’ చిత్రం ఆవిష్కరిస్తోంది. దానికి ఆయన సోదరుడు, “జెండాకు స్వరాజ్యం ముందస్తు అవసరం.. ఆ స్వరాజ్యానికి తిరుగుబాటే మార్గం” అని సమాధానం ఇచ్చినట్లు చూపించారు. ఆ మాటలతో ప్రేరణ పొందిన శివాజీ, మరాఠా నేలపై స్వరాజ్యం కోసం చేసిన వీరోచిత పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ సినిమాలో రితేశ్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్పాండే, జెనీలియా దేశ్ముఖ్ సంయుక్తంగా నిర్మించారు.
తాజాగా విడుదలైన చిత్ర ప్రదర్శన వీడియోను రితేశ్ దేశ్ముఖ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. “శక్తి, నైపుణ్యం, అంకితభావంతో కూడిన అమర వీరగాథను గర్వంగా సమర్పిస్తున్నాం” అని పేర్కొన్నారు. “వేలాది స్ఫూర్తిదాయక నక్షత్రాలు చీకటిలో కలిసిపోవచ్చు.. కానీ మీలాంటి ఆశయసూర్యుడు కొత్త యుగానికి నాంది పలకడానికి తప్పక ఉదయించాలి” వంటి ప్రభావవంతమైన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మరాఠా సామ్రాజ్యాన్ని నాశనం చేయాలనుకున్న ఆక్రమణదారులపై శివాజీ చేసిన పోరాటం, యుద్ధ దృశ్యాలు చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, జెనీలియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!