

దాదాపు మూడు దశాబ్దాలుగా బాలీవుడ్లో కొనసాగుతూ 50కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి ప్రీతి జింటా.. కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ‘వైబ్’ అనే యాక్షన్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఆమె మేడమ్ హెచ్ అనే శక్తివంతమైన సూపర్ స్పై పాత్రలో కనిపించనున్నారు. వంశిక ధీర్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం అవుతుండగా, కునాల్ కెమ్ము, స్పర్ష్ శ్రీవాస్తవ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వంశిక ధీర్ ఓ ఇంటర్వ్యూలో తన సినిమా అనుభవాలను పంచుకున్నారు.
పోస్టర్లో తనను తాను చూసుకున్నప్పుడు ఆశ్చర్యపోయానని, ట్రైలర్ విడుదల సందర్భంగా పెద్ద తెరపై తనను తాను చూసుకున్నప్పుడు కొంత ఇంపాస్టర్ సిండ్రోమ్కు గురైనట్లు అనిపించిందని వంశిక తెలిపారు. ఆ భావన ఇప్పటికీ పూర్తిగా పోలేదని చెప్పారు. ఆమె మాటలతో ఏకీభవించిన ప్రీతి జింటా.. సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ, ప్రతి పాత్రను చేసేటప్పుడు తాను చేయగలనా లేదా అనే సందేహం కలుగుతుందని తెలిపారు. తాను నటించిన సినిమాలను తెరపై చూడటం కూడా తనకు ఇబ్బందిగా అనిపిస్తుందని, థియేటర్లో కూర్చుని తన నటనను చూడలేనని చెప్పారు. సినిమా చూస్తున్న సమయంలో ఇంకా బాగా చేసి ఉండాల్సిందనే ఆలోచనలు వస్తుంటాయని ప్రీతి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!