

సంక్రాంతి సినిమాలంటే వినోదమేనని, అందుకే కడుపుబ్బా నవ్వించే తమ సినిమా ‘అనగనగా ఒక రాజు’ను పండుగకు విడుదల చేస్తున్నామని హీరో నవీన్ పోలిశెట్టి తెలిపారు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసి అందరూ ఆనందించాలని ఆయన కోరారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందుగా హైదరాబాద్లో ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, వరుసగా మూడు విజయాల తర్వాత అదే ఉత్సాహంతో మరో మంచి సినిమా చేయాలని అనుకున్నానని తెలిపారు. అయితే ఒక ప్రమాదం కారణంగా కొద్ది నెలలు షూటింగ్కు దూరమయ్యానని చెప్పారు. శారీరకంగా, మానసికంగా కోలుకునే సమయంలోనే బృందంతో కలిసి ఈ కథను సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. గత ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి, అందరి సహకారంతో ఆరు నెలల్లో సరదాగా సినిమా పూర్తయిందని అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇలాంటి వినోదాత్మక చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయడం సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు చెప్పారు.
నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రమని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించాలని కోరారు. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు విజయం సాధించాలని నవీన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండగగా మారిందని ఆయన అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!