

ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నా, మనసులో ఆనందం లేకపోతే ఆ జీవితం విలువలేనిదని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. తనకు లభించిన ముఖకవళికలు, నవ్వులు పంచే సహజ ప్రతిభ దేవుని వరమని, అదే తనకు అత్యంత పెద్ద సంపదగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారం అందజేశారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ మరియు రాష్ట్ర సృజనాత్మకత–సంస్కృతి సమితి సంయుక్తంగా ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన బ్రహ్మానందం, దేవుడు ఎన్నిసార్లు జన్మను ఇచ్చినా, ప్రతీ జన్మలో ఇతరులకు ఆనందం పంచే వ్యక్తిగానే పుట్టాలని కోరుకుంటానని చెప్పారు. తెనాలి పట్టణంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. తన అక్క అనసూయమ్మ తెనాలి JMJ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేసిన వేళ, తానే తరచుగా అక్కడికి వచ్చి అవసరమైన సామగ్రి, కూరగాయలు ఇచ్చి వెళ్లేవాడినని అన్నారు.
అలాగే, తన వివాహం కూడా తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో డిసెంబర్ 14 న జరిగిన విషయాన్ని స్మరించుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!